అమిత్‌ షా, మోదీ ఊచకోతను పాఠ్యాంశాల్లో చేర్చాలి

26 Jun, 2018 14:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో ఎమర్జెన్సీ విధించి 43 ఏళ్లయిన సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీపై, కాంగ్రెస్‌పై పలువురు బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరా గాంధీని హిట్లర్‌ అని విమర్శిస్తున్నారు.. కానీ ఆమె బీసీల నేత, ఆమెనే ప్రజలు మళ్లీ గెలిపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లో చేసిన ఊచకోతను పాఠ్యాంశాల్లో చేర్చాలి. రెండు సంఘటనలను పాఠ్యాంశాల్లో ఉంచితే ఎవరు ఎలాంటి వారో తెలిసిపోతుంద’ని అన్నారు.

మోదీ ఇప్పటికి ఆరెస్సెస్‌లో పని చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ కూడా మోదీలాగానే చేయని పనికి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మీరు ఎన్నికలు పెడితే కదా.. మేము సిద్దంగా ఉన్నామా లేదో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోతులకు అవకాశం ఇవ్వదని అనడాన్ని తప్పుబట్టారు. రాజకీయ పార్టీలను కోతులు అనడం సరైనది కాదని సూచించారు. బీసీలకు కూడా సీఎం అయ్యే అవకాశం వస్తుంది.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆ దిశలో ఆలోచన చేస్తున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు