ఈ ఛలోక్తులేమిటి చంద్రబాబు.!

15 Feb, 2019 14:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వినేవాళ్లు నవ్వుతారన్న భయం లేకుండా ఈ ఛలోక్తులేమిటి చంద్రబాబు.. అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘అమరావతిని మరో పదేళ్లలో ప్రపంచంలోనే అత్యంత జీవనయోగ్య నగరంగా మారుస్తారట. 2018 ర్యాంకుల ప్రకారం మొదటి 100 నగరాల్లో దేశంలోని ఒక్క సిటీకి కూడా స్థానం దొరక లేదు. వినేవాళ్లు నవ్వుతారన్న భయం లేకుండా ఈ ఛలోక్తులేమిటి చంద్రబాబు గారూ.’ అంటూ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. మరో ట్వీట్‌లో.. ‘అసలక్కడ నగరం లేదు నివాసితులు లేరు. అమరావతిలో రెండో సారి హ్యాపీ సిటీస్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. క్యాంటన్, జ్యూరిచ్ నగరాలతో 2000-వాట్-స్మార్ట్ సిటీ ఒప్పందాలు చేసుకున్నారట. గ్రాఫిక్స్ తర్వాత ఎంఓయూల దశ మొదలైనట్టుంది. పది రోజుల్లో షెడ్యూల్ వస్తుంటే ఈ నాటకాలేంటి చంద్రం సార్.’ అని విమర్శలు గుప్పించారు.

అంతకు ముందు జమ్మూకశ్మీర్‌ పుల్వామా ఉగ్ర దాడిని ఖండిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. ‘ ఈ ఉగ్రదాడి తీవ్రంగా కలచివేసింది. ఈ దాడిలో వీర మరణం పొందిన అమర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ పిరికిపంద చర్యను ఖండిస్తున్నాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.’  అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు