‘మీ రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి’

4 Feb, 2020 11:43 IST|Sakshi

సాక్షి, అమరావతి :  చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నాయకులపై  వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ బయటపడి ఎలాగో జైలుగు పోయేదేకదా అని పిచ్చి కూతలు కూస్తున్నారని విమర్శించారు. ‘మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకుల ఉక్రోషం కట్టలు తెంచుకుంటోంది. సీఎం హోదాను సైతం అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ బండారం బయట పడేటప్పటికి ఎలాగూ జైలుకు పోయేదేకదా అని పిచ్చి కూతలు కూస్తున్నారు. మీ రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి’  అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

(చదవండి : ‘ఇన్‌సైడర్‌’పై ఈడీ కేసు!)

కాగా, అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, మరికొందరు టీడీపీ నేతలపై సీఐడీ ఇచ్చిన ఆధారాల నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు హయాంలో రాజధాని ఏర్పాటుపై పథకం ప్రకారం ముందే లీకులు ఇచ్చి అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి లబ్ధి పొందేలా దోహదపడ్డారనే అభియోగాలున్నాయి. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందనే విషయాన్ని నిర్ధారించింది.

మరిన్ని వార్తలు