వైఎస్సార్ సీపీ నేతలు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, డాక్టర్ శశికళ
సాక్షి, కర్నూలు : తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే.. టీడీపీ నేతలు షర్మిలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు మహిళా విభాగం కో ఆర్డినేటర్ డాక్టర్ శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. జగనన్న పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ చూసే టీడీపీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇటువంటి చర్యలను వైఎస్సార్ సీపీ మహిళా విభాగం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మహిళల్లో చైతన్యం తీసుకువస్తామని పేర్కొన్నారు.
ఆ నీచ సంస్కృతి మాకు లేదు
నంద్యాల : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత వరకైనా వెళ్తారని వైఎస్సార్ సీపీ నంద్యాల సమన్వయ కర్త శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించేందుకు కేటీఆర్- వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడాన్ని టీడీపీ నేతలు విమర్శించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిలా స్వప్రయోజనాల కోసం దిగజారుడు రాజకీయాలు చేసే నీచ సంస్కృతి తమ పార్టీ అధ్యక్షుడికి లేదని పేర్కొన్నారు. ఇకనైనా తెలుగుదేశం పార్టీ నాయకులు దృష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.