‘వంగవీటి రాధా చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారు’

24 Jan, 2019 17:07 IST|Sakshi

సాక్షి, విజయవాడ : మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ట్రాప్‌లో పడ్డారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పేర్ని నాని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాధా మాటలతో లక్షలాది రంగా అభిమానుల కంట నీళ్లు తిరిగాయన్నారు. చంద్రబాబును రాధా నమ్మటం బాధాకరమన్నారు. సింహం కడుపున పుట్టిన రాధా.. చంద్రబాబు అనే నక్కకు కుందేలుగా దొరికారని వ్యాఖ్యానించారు. వంగవీటి రాధాకు వైఎస్సార్‌ సీపీ సముచిత స్థానం ఇచ్చిందన్నారు. వైఎస్సార్‌ సీపీ రాధాకు యువజన విభాగం అధ్యక్షుడిగా స్థానం కల్పించిందని తెలిపారు. రంగా విగ్రహావిష్కరణకు వెళ్లొద్దని ఏనాడూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పలేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా పార్టీ క్యాడర్‌ను కలవాలని, బాబు దుర్మార్గ పాలనను అంతమొందించాలంటే అధికారంలోకి రావాలనే వైఎస్‌ జగన్‌ చెప్పారన్నారు. రాధాతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. వంగవీటి రంగా హత్యకు టీడీపీనే కారణమని అందరికి తెలుసన్నారు. వంగవీటి రంగా హత్య టీడీపీ గూండాలే చేశారంటూ పాట కూడా ఉందన్నారు. రాధాకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదనటం సరికాదన్నారు. రాధాకు ప్రాధాన్యత ఇచ్చినందుకే దేవినేని నెహ్రూ పార్టీలో చేరలేదని తెలిపారు. ఆనాడు రాధా వద్దన్నారనే దేవినేని నెహ్రూను వైఎస్సార్‌ సీపీలో చేర్చుకోలేదని చెప్పారు. 

మరిన్ని వార్తలు