ప్రియురాలి వేధింపులు తాళలేక..

27 May, 2018 12:25 IST|Sakshi

 పురుగుల మందు తాగి ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం

 యువతి, ఆమె బంధువులపై చర్యలు తీసుకోవాలంటూ సూసైడ్‌ నోట్‌

సిద్దిపేటటౌన్‌: ప్రియురాలితో పాటు ఆమె బంధువులు వేధిస్తున్నారని సూసైడ్‌ నోట్‌ రాసి పురుగుల మందు తాగి ప్రేమికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. కోహెడ మండలం గుండారెడ్డిపల్లికి చెందిన పేకర్ల కృష్ణకుమార్‌ వృత్తి రీత్యా కారు డ్రైవర్‌. అతను అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏప్రిల్‌లో వీరిద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయారు. ఈ క్రమంలో సదరు యువతి జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌లో కృష్ణకుమార్‌ తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.

దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేయగా ఈనెల 3న స్టేషన్‌ బెయిల్‌ తీసుకుని బయటకు వచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు కృష్ణ కుటుంబ సభ్యులు అతనికి వేరే అమ్మాయితో ఈ నెల 11న వివాహం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న యువతి పెళ్లి ముందు రోజు కృష్ణ ఇంటికి వచ్చి తనను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవద్దని గొడవ చేసి, కోహెడ పోలీస్‌ స్టేషన్‌లో కృష్ణపై ఫిర్యాదు చేసింది. దీంతో ఆ పెళ్లి ఆగిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన కృష్ణ శుక్రవారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని బ్లాక్‌ ఆఫీస్‌ చౌరస్తా వద్ద పురుగుల మందు తాగి పడి పోయాడు. గమనించిన చుట్టుపక్కల వాళ్లు అతడిని 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

వివరాల కోసం అతని జేబులు వెతకగా సూసైడ్‌ నోట్‌ లభించింది. అందులో అతను ప్రేమించిన అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు, అన్నయ్య , బావ తనపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, రౌడీలతో కొట్టిస్తున్నారని, తన చావుకు కారణమైన వీరందరిని కఠినంగా శిక్షించాలని రాసిన సూసైడ్‌ నోట్‌ లభించింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ విషయంపై పోలీసులను సంప్రదించగా కేసు నమోదు కాలేదని తెలిపారు. 

మరిన్ని వార్తలు