పవన్‌.. నాగబాబు ఏ పరీక్ష పాస్‌ అయ్యారు?

25 Mar, 2019 20:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పే మాటలకు.. చేసే పనులకు అస్సలు పొంతన ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. నేడు చెప్పింది మర్నాడు ఉండదు.. మర్నాడు చెప్పింది ఎల్లుండి అస్సలే ఉండదు ఇదే పవన్‌ స్టైల్‌. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో చీకటి పొత్తులు, రహస్య ఒప్పందాలతో జనసేన పార్టీ కేడర్‌లో గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు.. అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని ఆ పార్టీ కార్యకర్తలే బహిరంగంగా వాపోతున్నారు. ఇక అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులయితేనే టికెట్‌ ఇస్తానన్న పవన్‌ మాటతప్పారని జన సైనికులు విమర్శిస్తున్నారు. 

ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు విధానాలు నచ్చక కొందరు నాయకులు పార్టీ వీడుతుండగా.. మరికొందరు పవన్‌ను నిలదేసేందుకు పలు ప్రశ్నలు సిద్దం చేస్తున్నారు. నరసాపురం టికెట్‌ ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకున్న నాగబాబుకు ఏ పరీక్ష పెట్టారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పదేపదే కండువాలు మార్చుకునే నేతలకు తన పార్టీలో స్థానం లేదని ప్రగల్బాలు పలికాడని.. అయితే నాదేండ్ల మనోహర్‌, ఎస్పీవై రెడ్డి, రావెల కిషోర్‌ బాబులను ఎలా పార్టీలో చేర్చుకున్నారని మరో ప్రశ్న లేవనెత్తారు. స్వార్థం, లాభాపేక్షతో వచ్చే వారికి తన పార్టీలో స్థానం లేదన్న పవన్‌.. టికెట్‌ కోసమే ఆశపడి వచ్చిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఆయన తోడల్లుడిని ఎలా పార్టీలో చేర్చుకున్నారని పవన్‌ను కడిగిపారేస్తున్నారు. ప్రస్తుతం నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ ప్రశ్నలకు తొలుత సమాధానం చెప్పాలని నెటిజన్లు పవన్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు