-

60 ఏళ్ల దాకా నటిస్తూనే ఉంటా!

1 Feb, 2018 07:42 IST|Sakshi
శ్రియ

తమిళసినిమా: 60 ఏళ్ల వరకూ నటిస్తూనే ఉంటానంటోంది నటి శ్రియ. ‘ఇష్టం’ అంటూ టాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేసిన ఈ ఉత్తరాది బ్యూటీ ఆ తరువాత మళై ఉనక్కు 20 ఎనక్కు 18 చిత్రం ద్వారా కోలీవుడ్‌ దిగుమతైంది. ఆ తరువాత జయంరవి, విజయ్, ధనుష్‌ వంటి సూపర్‌స్టార్‌తో నటించి, శివాజీ చిత్రంతో ఏకంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తోనే జత కట్టే లక్కీచాన్స్‌ కొట్టేసింది. అదే విధంగా తెలుగులోనూ చిరంజీవి, బాలకృష్ట, నాగార్జునల నుంచి నేటి తరం హీరోల వరకూ నటిస్తున్న శ్రియ ఖాతాలో సక్సెస్‌లు చాలానే ఉన్నాయి. ఇప్పటికీ హీరోయిన్‌గా బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంలో నరకాసురన్, తెలుగులో గాయత్రి, వీర భోగవసంతరా యులు, హిందీలో తడ్కా అంటూ మూడు భాషల్లో నటిస్తోంది.

ఇలా దశాబ్దంన్నర పాటు కథానాయకిగా రాణిస్తున్న శ్రియ తాను సినిమాలో ఇంకా కొనసాగడం గురించి స్పందిస్తూ చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఇంకా ఎన్నేళ్లు నటిస్తారు అని చాలా మంది అడుగుతున్నారని, హాలీవుడ్‌ నటి మెరిల్‌ 60 దాటి ఇంకా నటిస్తున్నారని, ఆమెలా తానూ సినిమాల్లో కొనసాగాలని కోరుకుంటున్నానని అంది. తాను కథక్‌ నాట్యకళాకారిణిఅని, సినిమాలతో బిజీగా ఉండడం వల్ల 10ఏళ్లుగా నాట్యానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పింది. మళ్లీ నాట్యంలో ప్రాక్టీస్‌ చేయడం మొదలెట్టానని చెప్పింది. నాట్యం అన్నది ధ్యానం లాంటిదని అంది. ఈ తరం వారు మన సంప్రదాయ నృత్యాలు భరతనాట్యం, కూచిపూడి, కథక్‌ నృత్యాలపై ఆసక్తిని పెంచుకుని వాటిలో శిక్షణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది. అలాంటి ప్రయత్నాన్నే తానూ చేస్తున్నానని శ్రియ అంటోంది.

మరిన్ని వార్తలు