కేప్టౌన్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ హాఫ్ సెంచరీ సాధించాడు. సఫారీలు 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో డివిలియర్స్ అర్థ శతకంతో ఆదుకున్నాడు. 55 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి సఫారీ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. నాల్గో వికెట్కు డుప్లిసిస్తో కలిసి దాదాపు 90 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దాంతో లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా 26 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సఫారీలకు ఆదిలోనే షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ డకౌట్గా పెవిలియన్ చేరగా, ఆపై స్వల్ప వ్యవధిలో మరో ఓపెనర్ మక్రమ్(5) అవుటయ్యాడు. ఈ రెండు వికెట్లను భువనేశ్వర్ కుమార్ సాధించి సఫారీలను కష్టాల్లోకి నెట్టాడు. టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసి తొలి ఓవర్ మూడో బంతికే ఎల్గర్ పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్టంప్ మీదుగా వెళుతున్న బంతిని హిట్ చేయబోయి కీపర్ వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
అటు తరువాత భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్ ఆఖరి బంతికి మక్రమ్ ఎల్బీగా అవుటయ్యాడు.కాగా, భువనేశ్వర్ కుమార్ వేసిన ఐదో ఓవర్ ఐదో బంతికి హషీమ్ ఆమ్లా(3) పెవిలియన్కు చేరాడు. కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్ గా అవుటయ్యాడు.