బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి మళ్లీ కష్టాల్లోకి..

1 Nov, 2019 10:36 IST|Sakshi

కరాచీ: సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టులో పునరాగమనం చేసిన షెహజాద్‌ అహ్మద్‌ మళ్లీ కష్టాల్లో పడ్డాడు. బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి తిరిగి ఇబ్బందుల్ని కొనితెచ్చుకున్నాడు. క్వాయిద్‌ ఈ అజామ్‌ ట్రోఫీలో భాగంగా సెంట్రల్‌ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజామ్‌.. సింధ్‌తో జరిగిన మ్యాచ్‌లో బాల్‌ ఆకారాన్ని దెబ్బ తీసే యత్నం చేశాడు. ఇది పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)దృష్టికి వెళ్లడంతో పాటు దీన్ని సీరియస్‌గా తీసుకోవడంతో అజామ్‌ కెరీర్‌ డైలమాలో పడింది. ‘ బాల్‌ ట్యాంపరింగ్‌కు యత్నించిన అజామ్‌పై విచారణ చేపట్టాం. అతనిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఫైసలాబాద్‌లో సింధ్‌తో మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో రెండో రోజు ఆటలో షెహజాద్‌ బంతి ఆకారాన్ని దెబ్బ తీసేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని ఫీల్డ్‌ అంపైర్లు రిఫరీ నదీమ్‌ దృష్టికి తీసుకెళ్లడంతో షెహజాద్‌కు సమన్లు జారీ చేశారు. దీనిపై ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇలా క్రమ శిక్షణా నియమావళిని ఉల్లంఘించడం షెహజాద్‌ ఇది తొలిసారి కాదు.

2018లో యాంటీ డోపింగ్‌ రూల్స్‌ను అతిక్రమించి నాలుగు నెలలపాటు నిషేధానికి గురయ్యాడు. దాంతో గతేడాది జూలై 10వ తేదీన అతనిపై సస్పెన్షన్‌ వేటు వేసింది పీసీబీ. కాగా, ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన షెహజాద్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో విమర్శల పాలయ్యాడు. కాకపోతే కోచ్‌ మిస్బావుల్‌ హక్‌ మాత్రం షెహజాద్‌కు మద్దతుగా నిలవడంతో ఊరట లభించింది. అయితే ఇప్పుడు బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో చిక్కుకున్న షెహజాద్‌పై పీసీబీ ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని వార్తలు