బెంబేలెత్తించిన అశ్విన్ యాదవ్

12 Mar, 2014 00:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎస్‌బీహెచ్ బౌలర్ అశ్విన్ యాదవ్ (7/64) విజృంభించడంతో డెక్కన్ క్రానికల్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా మంగళవారం మొదలైన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన డెక్కన్ జట్టు 166 పరుగులకే కుప్పకూలింది. రాహుల్ సింగ్ (57 బంతుల్లో 63, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి అర్ధసెంచరీ పూర్తిచేశాడు.
 
 మిగతా వారిలో ఒక్క ప్రణీత్ కుమార్ (36) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌బీహెచ్ కూడా తడబడింది. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఎస్‌బీహెచ్ 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అనిరుధ్ (76 బంతుల్లో 74, 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో రాణించాడు. అహ్మద్ ఖాద్రీ 40 పరుగులు చేయగా, డెక్కన్ బౌలర్ ఆకాశ్ భండారీ 3 వికెట్లు తీశాడు.
 
 షిండే 5 వికెట్లు తీసినా....
 ఆంధ్రాబ్యాంక్‌తో జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఈఎంసీసీ భారీ స్కోరు సాధించింది. ఆంధ్రా బ్యాంక్ బౌలర్ అమోల్ షిండే 5 వికెట్లు పడగొట్టినప్పటికీ భారీ స్కోరుకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈఎంసీసీ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. సూర్యతేజ (102 బంతుల్లో 83, 10 ఫోర్లు), శరత్ (81 బంతుల్లో 50, 9 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. విక్రమ్ సూర్యతేజ 44, రవితేజ 38, విశ్వజిత్ పట్నాయక్ 35, ఆకాశ్ 30 పరుగులు చేశారు.

మరిన్ని వార్తలు