కౌలాలాంపూర్ : ఇప్పటివరకూ పలు క్రీడలకే పరిమితమైన మ్యాచ్ ఫిక్సింగ్ ఇప్పుడు బ్యాడ్మింటన్ కూడా సోకినట్లు కనబడుతోంది. తాజాగా బ్యాడ్మింటన్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం మొదలైంది. గతంలో ఒక మ్యాచ్ను ఫిక్స్ చేయాల్సిందిగా బుకీలు సంప్రదించిన విషయాన్ని మలేసియా స్టార్ షట్లర్ లీ చోంగ్ వి వెల్లడించాడు. అయితే దానిని తాను తిరస్కరించినట్లు పేర్కొన్నాడు.
దీనిలో భాగంగా ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సహచర క్రీడాకారులను చూసి తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని లీ ఆవేదన వ్యక్తం చేశాడు. దేశ గౌరవమే తనకు ముఖ్యమని చెప్పాడు. ఫిక్సింగ్ ఆరోపణలపై ఇద్దరు మలేసియా ప్లేయర్లను బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఈ నెల చివర్లో విచారించనుంది.