హార్దిక్, ధావన్, భువనేశ్వర్‌ పునరాగమనం 

9 Mar, 2020 01:01 IST|Sakshi

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

కేదార్‌ జాదవ్‌పై వేటు

అహ్మదాబాద్‌: గాయాల నుంచి కోలుకున్న భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా... ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌... పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌లు జాతీయ జట్టులో మళ్లీ స్థానం దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల బృందాన్ని కొత్త చీఫ్‌ సెలెక్టర్‌ సునీల్‌ జోషి ఆదివారం ప్రకటించారు. పిక్క గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఈ సిరీస్‌ కోసం ఎంపిక చేయలేదు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విఫలమైన మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో శిఖర్‌ ధావన్‌... శార్దుల్‌ ఠాకూర్‌ స్థానంలో భువనేశ్వర్‌... ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే స్థానంలో హార్దిక్‌ పాండ్యా రాగా... ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌పై వేటు పడింది. ఇటీవల కాలంలో 35 ఏళ్ల కేదార్‌ అంతగా ఆకట్టుకోకపోవడంతో మూల్యం చెల్లించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు వరుసగా ఈనెల 12న (ధర్మశాల), 15న (లక్నోలో), 18న (కోల్‌కతాలో) జరగనున్నాయి.

భారత వన్డే జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, పృథ్వీ షా, లోకేశ్‌ రాహుల్, శుబ్‌మన్‌ గిల్, మనీశ్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్, హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్, జస్‌ప్రీత్‌ బుమ్రా, నవదీప్‌ సైనీ, కుల్దీప్‌ యాదవ్, యజువేంద్ర చహల్‌.

మరిన్ని వార్తలు