లండన్ : పుట్బాల్ మైదానంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఈ తరహా సంఘటనను చూసుండరు. కరబోవా కప్ ఫైనల్లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. చెల్సీ, మాంచెస్టర్ సిటీ జట్ల మధ్య ఆదివారం జరిగిన ఫైనల్లో చెల్సీ గోల్కీపర్ కెపా అర్రిజబల్గా ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 120 నిమిషాల గేమ్లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో షూటౌట్కు దారి తీసింది. అయితే మైదానంలో ఉన్న కెపా స్థానంలో మరో గోల్కీపర్ విల్లీ క్యాబెల్లెరోను సబ్స్టిట్యూట్గా పంపించాలని జట్టు కోచ్ భావించారు. అయితే దీనికి కెపా అంగీకరించలేదు. బయటకు రావలని కోచ్ మౌరిజియో సర్రి ఆదేశించినా అతను వినలేదు. రానుపో అంటూ సైగలు చేశాడు.
అంతేకాకుండా మ్యాచ్ రిఫరీకి తాను మైదానం వీడటానికి ఇష్టపడటం లేదని, ఆడటానికి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ కోచ్ సర్రికి తెలపడంతో అతను తీవ్ర అసహనానికి గురయ్యాడు. చొక్కా చించుకుంటూ అరుస్తూ మైదానం వీడాడు. ఇక ఈ మ్యాచ్లో చెల్సీ జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. షూట్ ఔట్లో 3-4 తేడాతో ఓటమి పాలైంది. ఇక కెపా కేవలం ఒక గోల్ను మాత్రం అడ్డుకోగలిగాడు. ఈ ఘటనపై కెపా ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చుకున్నాడు. తనకు కోచ్, జట్టు మేనేజ్మెంట్పై గౌరవం ఉందని, ఈ ఘటన పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను ఫిట్గా ఉన్నా బయటకు రమ్మనడం నచ్చలేదని, తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపాడు.
— kepa Arrizabalaga (@kepa_46) February 24, 2019