న్యూఢిల్లీ: భారత ఆటగాళ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా)... చెక్ రిపబ్లిక్తో ఈ ఏడాది సెప్టెంబరు 18 నుంచి 20 వరకు జరిగే డేవిస్కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ వేదికగా ఢిల్లీని ఎంపిక చేసింది. సోమ్దేవ్ దేవ్వర్మన్, యూకీ బాంబ్రీ, రోహన్ బోపన్న కోరిక మేరకు ఇక్కడి ఆర్కే ఖన్నా టెన్నిస్ స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించేందుకు ‘ఐటా’ అంగీకరించింది.
ఆర్కే ఖన్నా కోర్టులు మందకొడిగా ఉంటాయని, బంతులు తక్కువ ఎత్తులో వస్తాయని... ఈ అంశం భారత ఆటగాళ్లకు కలిసి వస్తుందని సోమ్దేవ్ ‘ఐటా’ అధికారులవద్ద ప్రస్తావించాడు. దాంతో ఆటగాళ్ల అభిప్రాయాలను గౌరవిస్తూ ఢిల్లీని వేదికగా ఎంపిక చేస్తున్నట్లు ‘ఐటా’ అధ్యక్షుడు అనిల్ ఖన్నా తెలిపారు.