‘నన్ను 15 పరుగుల బ్యాట్స్‌మన్‌ అన్నారు’

29 May, 2020 14:47 IST|Sakshi

స్లెడ్జ్‌ చేసిన వారే అభినందించారు: ధావన్‌

న్యూఢిల్లీ: భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఆటగాళ్లకు ఎంతటి ఒత్తిడి ఉంటుందో తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఏ స్థాయి క్రికెట్‌ మ్యాచ్‌ జరిగినా ఆటగాళ్లలో గెలిచి తీరాలన్న కసి కనబడుతుంది. దాంతో ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. ‘నేను గొప్ప అంటే నేను గొప్ప’ అనేంతంగా ఇరు దేశాల క్రికెటర్లు మాటల యుద్ధానికి తెరతీస్తారు. ఇక్కడ ప్రేక్షకులు కూడా ఏమాత్రం తగ్గరు. ఆ క్రమంలోనే క్రికెటర్లపై విపరీతమైన స్లెడ్జింగ్‌కు దిగుతారు. ఇదే తరహా అనుభవాన్ని ఎదుర్కొన్న టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌.. దాన్ని మళ్లీ గుర్తు చేసుకున్నాడు. 2015 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆరంభానికి ముందు తాను స్లెడ్జింగ్‌ బారిన పడినట్లు ధావన్‌ తెలిపాడు. (‘అదే రోహిత్‌ను సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ చేసింది’)

‘గ్రౌండ్‌లో పాకిస్తాన్‌తో తలపడుతుంటే విపరీతమైన ఒత్తిడిని భరించాల్సి ఉంటుంది. మొత్తం మన ఫీలింగే మారిపోతుంది. మనం క్రికెటర్లమేనా అనే సంగతి కూడా మరిచిపోతాం. 2015లో పాక్‌తో అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో నేను స్లెడ్జింగ్‌కు గురయ్యా. అప్పటికి నా ఫామ్‌ బాలేదు. వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో విఫలమయ్యా. అదే సమయంలో పాకిస్తాన్‌తో నా తొలి వరల్డ్‌కప్‌ మ్యాచ్‌. నేను మ్యాచ్‌ జరిగే వేదికకు వెళుతున్నా. నన్ను చూసిన పాకిస్తాన్‌ ఫ్యాన్స్‌ అరపులతో గోల గోల చేశారు. నన్ను 15 పరుగుల బ్యాట్స్‌మన్‌ అంటూ స్లెడ్జింగ్‌కు దిగారు. 15 పరుగులు చేసి ఔటయ్యే బ్యాట్స్‌మన్‌ అంటూ హేళన చేశారు. దానిని నేను లైట్‌గా తీసుకున్నా. కానీ మ్యాచ్‌లో 73 పరుగులతో మెరిశా. నన్ను ఎవరైతే హేళన చేశారో వారే నేను పెవిలియన్‌కు వెళుతున్న సమయంలో  చప్పట్లతో అభినందించారు. (‘భారత్‌ ఓడిపోతుందని అనలేదు’)

మరిన్ని వార్తలు