ధోనిపై ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ ఆమ్రపాలి స్కామ్తో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తీవ్ర ఇబ్బందుల్లో పడినట్లే కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ధోనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కుట్రలో అతడికి కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించిన ఆమ్రపాలి గ్రూప్ బాధితులు.. ఎఫ్ఐఆర్లో ధోని పేరును కూడా చేర్చారు. క్రికెటర్గా ధోనికి, బిల్డర్గా అనిల్ శర్మకు ఎంతో పేరుందని, వీరిపై నమ్మకంతోనే ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు సొమ్ములు చెల్లించామని బాధితులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ గ్రూప్నకు ధోని ప్రచారకర్తగా వ్యవహరించాడు. ఫ్లాట్లు విక్రయిస్తామంటూ అనేక మంది వద్ద సొమ్ములు సేకరించిన సంస్థ ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా అనేక కంపెనీలకు మళ్లించింది.
ఇందులో ధోని భార్యకు చెందిన కంపెనీ కూడా ఉంది. అయితే, డిపాజిట్లు తీసుకున్న ఆమ్రపాలి కంపెనీ అగ్రిమెంట్ ప్రకారం ఓనర్లకు ఫ్లాట్లు అప్పజెప్పలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2017లో దీనిపై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. ప్రజల నుంచి వేలాది కోట్ల రూపాయలు వసూలు చేసిన సంస్థ ఆ మొత్తాన్ని వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలకు బదిలీ చేసినట్టు తేలింది. ప్రజలను మోసం చేసిన కేసులో ఆమ్రపాలి డైరెక్టర్లు సైతం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ కంపెనీకి ధోని బ్రాండ అంబాసిడర్గా వ్యవహరించడమే అతనిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి ప్రధాన కారణమైంది. ఈ గ్రూప్ ద్వారా ఫ్లాట్లు కొనుగోలు చేసిన పలువురు చేసిన ఫిర్యాదు మేరకు ఇప్పటివరకూ ఏడు ఎఫ్ఐఆర్లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు.