‘సాయ్’లో ఘోరం

8 May, 2015 01:28 IST|Sakshi

నలుగురు మహిళా అథ్లెట్ల ఆత్మహత్యాయత్నం
ఒకరు మృతి  క్రీడా శాఖ విచారణ

 
న్యూఢిల్లీ : భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్)లో దారుణం చోటు చేసుకుంది. కేరళలోని అళెప్పీ సాయ్ వాటర్ స్పోర్ట్స్ సెంటర్‌లో నలుగురు మహిళా అథ్లెట్స్ ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు.  బుధవారం  జరిగిన ఈ ఘటనలో 15 ఏళ్ల అపర్ణా రామభద్రన్ మృతి చెందగా మిగతా ముగ్గురు టీనేజర్ల పరిస్థితి విషమంగానే ఉంది. వీరంతా విషపూరిత పండు (సెర్బెరా ఒడోలమ్)ను తిని ఈ దారుణానికి పాల్పడ్డారు.

ఇంటర్  చదువుతున్న అపర్ణ పదో తరగతిలోనే సాయ్‌కు ఎంపికైంది. సీనియర్ల, కోచ్, సిబ్బంది వేధింపులు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తమతో తెలిపిందని అపర్ణ తల్లి గీత ఆరోపించింది. అయితే ఆమె ఆరోపణలను సాయ్ హాస్టల్ వార్డెన్ ఖండించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నలుగురి సంతకంతో కూడిన ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు సంఘటన జరగ్గా రాత్రి 9 గంటలకు ఆస్పత్రికి తీసుకురావడం వెనుక గల కారణంపై విచారణ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ పద్మకుమార్ తెలిపారు. ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరమని డెరైక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్ అన్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర క్రీడా శాఖ విచారణకు ఆదేశించింది.

మరిన్ని వార్తలు