ఫించ్‌ సెంచరీ: ఆసీస్‌ గెలుపు 

24 Mar, 2019 01:42 IST|Sakshi

షార్జా: భారత్‌లో భారత్‌ను వన్డే సిరీస్‌లో ఓడించి ఉత్సాహం మీదున్న ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్‌తో సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. పాక్‌తో జరిగిన తొలి వన్డేలో ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (135 బంతుల్లో 116; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత సెంచరీ... షాన్‌ మార్‌‡్ష (102 బంతుల్లో 91 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత బ్యాటింగ్‌... ఆసీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించాయి.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 280 పరుగులు చేసింది. హారిస్‌ సొహైల్‌ (115 బంతుల్లో 101 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌) అజేయ సెంచరీ సాధించాడు. ఆసీస్‌ బౌలర్లలో కూల్టర్‌నీల్‌కు రెండు వికెట్లు దక్కాయి. 281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.  

>
మరిన్ని వార్తలు