పంత్‌ను తీసుకోవాల్సింది.. పొరపాటు చేశారు

15 May, 2019 12:48 IST|Sakshi

కోల్‌కతా: టీమిండియా యువ సంచలనం రిషభ్‌ పంత్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడాన్ని సౌరవ్‌ గంగూలీ తప్పుబట్టారు. ప్రపంచకప్‌లో కోహ్లి సేన పంతన్‌ను తప్పకుండా మిస్సవుతుందని తెలిపాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్స్‌కు వెళ్లడంలో పంత్‌ పాత్ర మరవలేనిదని గుర్తు చేశాడు. చాలా మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించాడని వివరించాడు. ‘రిషభ్‌ పంత్‌ కచ్చితంగా టీమిండియాలో ఉండాల్సింది. ప్రపంచకప్‌కు అతడిని ఎంపిక చేసుండాల్సింది. ఎవరి స్థానంలో తెలియదు కానీ పంత్‌ను తీసుకోవాల్సింది. కోహ్లి సేన కచ్చితంగా పంత్‌ను మిస్సవుతుంది.’అంటూ గంగూలీ పేర్కొన్నాడు. 
పంత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీకి దాదా మెంటార్‌గా వ్యవహరించాడు. ఇక గతంలోనే పంత్‌ను ప్రపంచకప్‌కు తీసుకోకపోవడాన్ని గంగూలీ, పాంటింగ్‌లు విమర్శించారు. తాజా ఐపీఎల్‌  సీజన్‌లో అతడు మొత్తం 16 మ్యాచుల్లో 488 పరుగులు చేశాడు. అనుభవం రీత్యా పంత్‌ను కాదని దినేశ్‌ కార్తీక్‌ను ఎంపిక చేశామని చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ప్రపంచకప్‌లో టీమిండియా, పాకిస్తాన్‌ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయని దాదా అభిప్రాయపడ్డాడు. ఇంగ్లీష్‌ పిచ్‌లు పాక్‌కు అచ్చొస్తాయన్నాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్‌ను పాక్‌ ఇంగ్లండ్‌లోనే గెలిచిన విషయాన్ని గంగూలీ గుర్తుచేశాడు. 

మరిన్ని వార్తలు