అనూప్‌ శ్రీధర్‌ అకాడమీకి మెంటార్‌గా గోపీచంద్‌

25 Feb, 2020 08:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బెంగళూరులోని ‘ద స్పోర్ట్స్‌ స్కూల్‌’ అనూప్‌ శ్రీధర్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీతో భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ జత కట్టాడు. విద్యార్థులకు విద్యతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతులు కల్పించి దేశం గర్వించదగిన క్రీడాకారులుగా తయారు చేయడమే లక్ష్యంగా ఏర్పడిన ఈ స్కూల్‌లోని బ్యాడ్మింటన్‌ అకాడమీకి గోపీచంద్‌ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత నుంచి అకాడమీకి మెంటార్‌గా సేవలందిస్తానని గోపీచంద్‌ తెలిపాడు.

‘చిన్నారుల్ని క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోన్న ‘ద స్పోర్ట్స్‌ స్కూల్‌’ను నేను చాలాకాలంగా గమనిస్తున్నా. ఆట పట్ల నా దృక్పథంతో సరితూగేలా స్పోర్ట్స్‌ స్కూల్‌ తన కార్యక్రమాల్ని కొనసాగిస్తోంది. అందుకే వీరితో కలిసి పనిచేసేందుకు సంతోషంగా అంగీకరించా. రెండు దశాబ్దాలుగా ఆటగాడిగా, కోచ్‌గా నాకు అనూప్‌ శ్రీధర్‌ గురించి బాగా తెలుసు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత్‌ ఆధిపత్యం చెలాయించడమే మా ఇద్దరి లక్ష్యం. ఇదే లక్ష్యంతో ద స్పోర్ట్స్‌ స్కూల్‌లో మెంటార్‌గా సేవలందిస్తా’ అని గోపీచంద్‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది హైదరాబాద్‌లోనూ ద స్పోర్ట్స్‌ స్కూల్‌ బ్రాంచ్‌ ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్‌ చెన్‌రాజ్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు