అడ్డంగా బుక్కయిన మహిళల టీ20 కెప్టెన్‌..!

2 Jul, 2018 20:16 IST|Sakshi

భారత మహిళల టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చిక్కుల్లో పడ్డారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీన హర్మన్‌ప్రీత్‌ పంజాబ్‌ డీఎస్పీగా బాధ్యతల చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆమె ఆ ఉద్యోగం కొల్పోయే అవకాశం కనబడుతోంది. ఉద్యోగం చేపట్టే సమయంలో ఆమె సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని పోలీసుల వెరిఫికేషన్‌లో తెలింది. ఆమె సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్‌ బోగస్‌ అని నిర్ధారించిన పోలీసులు ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హర్మన్‌ప్రీత్‌ను ఆ ఉద్యోగం నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది.

దీనిపై పంజాబ్‌ డీజీపీ ఎంకే తివారీ ఓ జాతీయ దినపత్రికతో మాట్లాడుతూ.. ‘హర్మన్‌ప్రీత్‌ తాను మీరట్‌లోని చౌదరి చరణ్‌ సింగ్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసినట్టు సర్టిఫికెట్‌ అందజేసింది. కానీ వెరిఫికేషన్‌లో ఆ యూనివర్సిటీ అధికారులు హర్మన్‌ప్రీత్‌ సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్‌ రిజిస్ర్టేషన్‌ నంబర్‌ తమ రికార్డులో లేదని తెలిపారు. ఈ నివేదికను సంబంధిత శాఖలకు అందజేశామ’ని తెలిపారు.

తర్వాత స్పందిస్తాను : హర్మన్‌ప్రీత్‌
దీనిపై హర్మన్‌ప్రీత్‌ వివరణ కోరగా.. ‘అలాంటిది ఎం జరగలేదు. మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు. నేను సంబంధిత అధికారులతో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడుతాను’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు