హిమ్మత్‌ సింగ్‌ సెంచరీ: భారత్‌ హ్యాట్రిక్‌

11 Dec, 2018 00:40 IST|Sakshi

కొలంబో: ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఎమర్జింగ్‌ కప్‌ టోర్నీలో భారత జట్టు హ్యాట్రిక్‌ విజయం సాధించింది. గ్రూప్‌ ‘ఎ’లో సోమవారం ఆతిథ్య శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హిమ్మత్‌ సింగ్‌ (126 నాటౌట్‌; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత సెంచరీతో భారత్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 260 పరుగులు చేసింది. ఫెర్నాండో (80; 6 ఫోర్లు, 1 సిక్స్‌), గుణరత్నే (67 నాటౌట్‌; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో శివమ్‌ మావి 3, ప్రసిధ్‌ కృష్ణ 2 వికెట్లు తీశారు.

తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ 47.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసి గెలిచింది. 20 పరుగులకే 2 టాపార్డర్‌ వికెట్లను కోల్పోయిన భారత్‌ను హిమ్మత్, రుతురాజ్‌ గైక్వాడ్‌ (67; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఆదుకున్నారు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 148 పరుగులు జోడించడంతో భారత్‌ విజయం సులువైంది.  ఈ టోర్నీలో ఇదివరకే సెమీస్‌ చేరిన భారత్‌ అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి 6 పాయింట్లతో గ్రూప్‌ టాపర్‌గా నిలిచింది. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో పాకిస్తాన్‌తో భారత్‌; బంగ్లాదేశ్‌తో శ్రీలంక తలపడతాయి.   

మరిన్ని వార్తలు