మెరిసిన అక్షత్, రాయుడు

10 Feb, 2018 00:25 IST|Sakshi
అక్షత్‌ రెడ్డి, అంబటి రాయుడు

సౌరాష్ట్రపై హైదరాబాద్‌ విజయం

విజయ్‌ హజారే ట్రోఫీ 

సాక్షి, హైదరాబాద్‌: విదర్భ చేతిలో ఎదురైన దారుణ ఓటమి నుంచి హైదరాబాద్‌ జట్టు వెంటనే గుణపాఠం నేర్చుకుంది. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా పటిష్టమైన సౌరాష్ట్రతో శుక్రవారం జరిగిన గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో హైదరాబాద్‌ నాలుగు వికెట్లతో అద్భుత విజయం సాధించింది. ఈ టోర్నీలో మూడో విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా సౌరాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా... అక్షత్‌ రెడ్డి (96 బంతుల్లో 94; 10 ఫోర్లు, 1 సిక్స్‌), అంబటి రాయుడు (83 బంతుల్లో 76; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) విజృంభించడంతో హైదరాబాద్‌ 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసి గెలుపొందింది. హైదరాబాద్‌ పేసర్‌ సిరాజ్‌ (3/46) ధాటికి సౌరాష్ట్ర సీనియర్‌ ప్లేయర్లు రాబిన్‌ ఉతప్ప (14), పుజారా (10) జట్టు స్కోరు 37 వద్దే పెవిలియన్‌ చేరారు. కాసేపటికే రవీంద్ర జడేజా (7) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో సమర్థ్‌ వ్యాస్‌ (57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), అర్పిత్‌ (49; 5 ఫోర్లు), పరేఖ్‌ మన్కడ్‌ (62; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో సౌరాష్ట్ర మెరుగైన స్కోరు చేయగలిగింది. హైదరాబాద్‌ బౌలర్లలో రవితేజ, రవికిరణ్, మెహదీ హసన్, భండారిలకు తలా ఓ వికెట్‌ దక్కింది. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో అక్షత్‌ రెడ్డి ఆటే హైలైట్‌. రాయుడుతో కలిసి ధాటిగా ఆడిన అతను త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో ఆకాశ్‌ భండారి (29 బంతు ల్లో 41 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడటంతో మరో మూడు బంతులు మిగిలుండ గానే హైదరాబాద్‌ లక్ష్యాన్ని ఛేదించింది. 

ఆంధ్రను గెలిపించిన రికీ భుయ్‌ 
చెన్నై వేదికగా జరుగుతున్న గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర వికెట్‌ తేడాతో గోవాపై నెగ్గింది. ఈ మ్యాచ్‌లో రికీ భుయ్‌ (86 బంతుల్లో 56 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఆంధ్ర బౌలర్లు గిరినాథ్‌ రెడ్డి (4/32), విహారి (2/18), అయ్యప్ప (2/37)ల ధాటికి గోవా 47.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రికీ ఒంటరి పోరాటం చేయడంతో ఆంధ్ర 49.3 ఓవర్లలో 191 పరుగులు చేసి గెలుపొందింది. 

మరిన్ని వార్తలు