నేనైతే వారినే ఎంపిక చేస్తా: సెహ్వాగ్‌

22 Aug, 2019 13:35 IST|Sakshi

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలంటే సీనియర్‌ ఆటగాళ్లతోనే  బరిలోకి దిగాలని భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు.  ఆరుగురు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌తో మ్యాచ్‌కు సిద్ధం కావాలా.. లేక వికెట్‌ కీపర్‌తో కలుపుకుని ఐదుగురు బ్యాట్స్‌మెన్‌తో పోరుకు వెళ్లాలా అనే దానిపై కోహ్లి గ్యాంగ్‌ కసరత్తులు చేస్తోంది.  ఆరుగురు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌తో తుది జట్టును సిద్ధం చేస్తే, ఒక స్పెషలిస్టు స్పిన్నర్‌కు ఉద్వాసన తప్పదు. అప్పుడు ఆరో బ్యాట్‌మన్‌గా రోహిత్‌ శర్మకు కానీ హనుమ విహారి కానీ ఎంపిక అవుతారు.  అదే సమయంలో స్పిన్నర్‌గా రవి చంద్రన్‌ అశ్విన్‌కు కానీ కుల్దీప్‌ యాదవ్‌కు కానీ తుది జట్టులో చోటు దక్కుతుంది.  ఒకవేళ ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లతో పోరుకు సిద్ధమైనా అప్పుడు నలుగురు పేసర్లను జట్టులోకి తీసుకునే అవకాశమే ఎక్కువ.

ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌ స్పందిస్తూ’ నేనైతే ఆరో బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మనే ఎంపిక చేస్తా. హనుమ విహారి కంటే రోహిత్‌ మంచి బ్యాట్స్‌మన్‌. నిలకడతో పాటు అవసరమైన సందర్భంలో భారీ షాట్లు కొట్టగలడు.  టీమిండియా గతంలో ఆడిన టెస్టు సిరీస్‌ల్లో హనుమ విహారి ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేయడంతో పాటు కొన్ని ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేశాడు. నన్ను అడిగితే విహారి కంటే రోహిత్‌ శర్మనే సరైనవాడు’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

ఇక స్పెషలిస్టు స్పిన్నర్‌ విషయానికి వచ్చేసరికి చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కంటే రవి చంద్రన్‌ అశ్వినే ఉత్తమం అని సెహ్వాగ్‌ తేల్చిచెప్పాడు. ‘ మనకున్న అత్యుత్తమ టెస్టు స్పిన్నర్‌ అశ్విన్‌. అందులో సందేహం లేదు. టెస్టు క్రికెట్‌లో హర్భజన్‌ సింగ్‌ 417 వికెట్ల రికార్డును అశ్విన్‌ త్వరలోనే బ్రేక్‌ చేస్తాడు. విండీస్‌లో వికెట్‌ భారత్‌ తరహాలోనే ఉండే అవకాశం ఎక్కువగా ఉండటంతో అశ్విన్‌ను తీసుకుంటేనే ఉత్తమం’ అని సెహ్వాగ్‌ తెలిపాడు.  అయితే చివరగా ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగితేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు సెహ్వాగ్‌. విండీస్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్‌ చేయాలంటే ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లు ఉండాలన్నాడు.

మరిన్ని వార్తలు