కొలంబో: తనను శ్రీలంక వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి తప్పించడంపై ఏంజెలో మాథ్యూస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆసియాకప్లో తమ జట్టు లీగ్ దశ నుంచే నిష్ర్కమించడాన్ని సాకుగా చూపుతూ వన్డే కెప్టెన్సీ పదవి నుంచి తొలగించడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. శ్రీలంక జట్టు ఓవరాల్ ప్రదర్శనకు తనను బలి పశువును చేశారని మాథ్యూస్ విమర్శించాడు.
‘ఆసియాకప్లో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లపై శ్రీలంక పేలవ ప్రదర్శనకు నన్ను బలి పశువును చేశారు. నన్ను కెప్టెన్సీ నుంచి ఉన్నపళంగా తప్పించారు. ఈ విషయంలో నన్ను ఒక్కడ్నే బాధ్యున్ని చేయడం సబబేనా’ అని శ్రీలంక క్రికెట్ బోర్డుకు మాథ్యూస్ లేఖ రాశాడు. అయితే దీన్ని లంక బోర్డు సమర్ధించుకుంది. దినేశ్ చండీమాల్కు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పే క్రమంలోనే మాథ్యూస్ను తప్పించినట్లు పేర్కొంది. త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనున్న సందర్భంలో కెప్టెన్ను మార్చినట్లు బోర్డు తెలిపింది.