‘రిషభ్‌.. నీ రోల్‌ ఏమిటో తెలుసుకో’

20 Feb, 2020 16:08 IST|Sakshi

వెల్లింగ్టన్‌: గతేడాది వరకూ భారత క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు  ‘ఫస్ట్‌ చాయిస్‌’ వికెట్‌ కీపర్‌గా కొనసాగిన రిషభ్‌ పంత్‌..  కొంతకాలంగా రిజర్వ్‌ బెంచ్‌లో కూర్చోవడానికి పరిమితమయ్యాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పంత్‌కు అయిన గాయం అతన్ని రిజర్వ్‌ స్థానంలోకి నెట్టేసింది. రిషభ్‌ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ కీపర్‌గా సక్సెస్‌ కావడమే అందుకు కారణం.  అప్పట్నుంచీ భారత్‌ ఆడుతున్న మ్యాచ్‌లను చూస్తూ జట్టులో చోటు కోసం వేచిచూస్తున్నాడు రిషభ్‌ పంత్‌ . అయితే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ లేకపోవడంతో పంత్‌కు అవకాశం ఇవ్వొచ్చు. కానీ ఇక్కడ కూడా గ్యారంటీ లేదు.  కివీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో వృద్ధిమాన్‌ సాహా కూడా ఉండటంతో పంత్‌ తుది జట్టులో ఉండటం అనేది కాస్త అనుమానమే. అత్యుత్తమ కీపింగ్‌ స్కిల్స్‌ ఉన్న సాహా వైపే మేనేజ్‌మెంట్‌ మొగ్గుచూపితే మాత్రం మళ్లీ పంత్‌ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. 

దీనిపై టీమిండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే మాట్లాడుతూ..  ఏది జరిగినా పాజిటివ్‌గా ఉంటూ మన స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడమే మనముందున్న కర్తవ్యమని గుర్తిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదన్నాడు. ‘ మనం ఏమి చేస్తున్నామో దాన్ని అంగీకరించడం అనేది ముఖ్యం. ఏది జరిగినా సానుకూల ధోరణితో ఉండాలి. నేర్చుకుంటూ ముందుగా సాగడమే ఆటగాడిగా మన కర్తవ్యం. ఇక్కడ జూనియర్‌, సీనియర్‌ అనే తేడా ఏమీ ఉండదు. తుది జట్టులో ఆడకుండా బయట కూర్చోవడానికి ఎవరూ ఇష్టపడరు. ఫలానా గేమ్‌కు ఎలా సన్నద్ధం కావాలో దానిపై మాత్రమే మేనేజ్‌మెంట్‌ ఫోకస్‌ చేస్తోంది. దాన్ని నువ్వు తప్పకుండా అంగీకరించాల్సి ఉంది. మన వ్యక్తిగత ప్రదర్శన అనేదే చాలా ముఖ్యం. మన ప్రదర్శన బాలేకపోతే స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకుని అందుకోసం సన్నద్ధం కావాలి. నీ ఆటను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడితే అవకాశం తప్పకుండా వస్తుంది.  ముందు నీ రోల్‌ ఏమిటో తెలుసుకోవాలి. రిషభ్‌ పంత్‌ పాత్ర ఏమిటో ఒకసారి విజువలైజ్‌ చేసుకోవాలి. అప్పుడు అతని సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తన శక్తి సామర్థ్యాలపై పంత్‌ ఫోకస్‌ చేసి వాటికి మరింత సానబెట్టాలి ’ అని రహానే పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: అతనేమీ సెహ్వాగ్‌ కాదు.. కానీ)

మరిన్ని వార్తలు