భారత్ ‘ఎ’కే టైటిల్

3 Aug, 2014 02:17 IST|Sakshi
భారత్ ‘ఎ’కే టైటిల్

ఫైనల్లో ఆస్ట్రేలియా ‘ఎ’పై గెలుపు  
 నాలుగు దేశాల వన్డే టోర్నీ
 
 డార్విన్: టోర్నీ అంతటా నిలకడగా ఆడిన భారత ‘ఎ’ జట్టు నాలుగు దేశాల వన్డే టోర్నీలో విజేతగా నిలిచింది. శనివారం ఆతిథ్య ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన ఫైనల్లో భారత యువజట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
 
 టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కామెరూన్ వైట్ (150 బంతుల్లో 137; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ, ఫిలిప్ హ్యూజెస్ (70 బంతుల్లో 51; 3 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆసీస్‌కు గట్టి పునాది వేయగా, చివర్లో కటింగ్ (21 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి భారీస్కోరునందించాడు. అనంతరం భారత కుర్రాళ్లు 48.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసి గెలిచారు.
 
 ఒక దశలో 51 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను మనోజ్ తివారి (75 బంతుల్లో 50; 3 ఫోర్లు), కేదార్ జాదవ్ (73 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)లు ఆదుకున్నారు. అయితే వీరిద్దరు వెంటవెంటనే అవుట్ కావడంతోపాటు 182 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మరోసారి భారత్ ఇక్కట్లలో పడింది. ఈ దశలో రిషి ధావన్ (55 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు), అక్షర్ పటేల్ (38 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్)లు ఏడో వికెట్‌కు అజేయంగా 93 పరుగులు జోడించి భారత్‌ను గెలిపించారు.
 
 సంక్షిప్త స్కోర్లు
 ఆస్ట్రేలియా ‘ఎ’: 50 ఓవర్లలో 274/5 (వైట్ 137, హ్యూజెస్ 51; ధావళ్ కులకర్ణి 3/51); భారత్ ‘ఎ’: 48.4 ఓవర్లలో 275/6 (జాదవ్ 78, రిషి ధావన్ 56 నాటౌట్; కటింగ్స్ 3/46).
 

మరిన్ని వార్తలు