హాంకాంగ్: ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో భారత క్రీడాకారులు తమ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. పోటీల రెండో రోజు శనివారం భారత్కు ఐదు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలు వచ్చాయి. బాలుర 10 వేల మీటర్ల నడక విభాగంలో విశ్వేంద్ర సింగ్ 44 నిమిషాల 9.75 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకం గెలిచాడు. పరమ్జీత్ సింగ్ బిష్త్ (44ని:21.96 సెకన్లు) కాంస్యం సాధించాడు. డెకాథ్లాన్లో ఉసైద్ ఖాన్ 6952 పాయింట్లతో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.
అన్సార్ అలీ (5943 పాయింట్లు)కి కాంస్యం లభించింది. బాలికల లాంగ్జంప్లో థబిత ఫిలిప్ మహేశ్వరన్ (5.86 మీటర్లు) బంగారు పతకాన్ని చేజిక్కించుకోగా... అంబ్రిక నర్జారీకి కాంస్యం దక్కింది. బాలుర 400 మీటర్ల రేసులో అబ్దుల్ రజాక్ (48.17 సెకన్లు)... బాలికల 100 మీటర్ల విభాగంలో అవంతిక నరాలే (11.97 సెకన్లు) స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. బాలుర 2000 మీటర్ల స్టీపుల్చేజ్లో అతుల్ కుమార్ (6ని:00.45 సెకన్లు) రజతం గెలిచాడు.