భారత బౌలర్ల విజృంభణ: కష్టాల్లో ఆసీస్‌

5 Jan, 2019 10:10 IST|Sakshi

సిడ్నీ; భారత్‌తో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో ఆసీస్‌ కష్టాల్లో పడింది. భారత బౌలర్లు విజృంభించడంతో  ఆసీస్‌ 198 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయి ఎదురీదుతోంది. 24/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం ఆటను కొనసాగించిన ఆసీస్‌ 72 పరుగుల వద్ద ఉస్మాన్‌ ఖవాజా(27) వికెట్‌ను నష్టపోయింది. తొలి సెషన్‌లో భారత్‌కు పరీక్షగా నిలిచిన ఖావాజాను కుల్దీప్‌ యాదవ్‌ బోల్తా కొట్టించడంతో ఆసీస్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో మార్కస్‌ హారిస్‌కు జత కలిసిన లబుస్కాంజ్‌ ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టాడు. వీరిద్దరూ 56 పరుగులు జోడించిన తర్వాత హారిస్‌(79) పెవిలియన్‌ చేరాడు.

రవీంద్ర జడేజా బౌలింగ్‌లో హారిస్‌ బౌల్డ్‌ కావడంతో 128 పరుగుల వద్ద ఆసీస్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఆపై స‍్పల్ప వ్యవధిలో షాన్‌ మార్ష్‌(8), లబూస్కాంజ్‌(38)లు ఔట్‌ కావడంతో ఆసీస్‌ 152 పరుగులకే నాలుగు వికెట్లను చేజార్చుకుంది. షాన్‌ మార్ష్‌ను జడేజా ఔట్‌ చేయగా, లబూస్కాంజ్‌ను షమీ పెవిలియన్‌ చేర్చాడు. మరో 40 పరుగుల వ్యవధిలో ట్రావిస్‌ హెడ్‌(20) సైతం పెవిలియన్‌ బాట పట్టడంతో 192 పరుగుల వద్ద ఆసీస్‌ ఐదో వికెట్‌ను నష్టపోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చిన ట్రావిస్‌ హెడ్‌ ఐదో్ వికెట్‌గా ఔటయ్యాడు.

టీ విరామం తర్వాత టిమ్‌ పైన్‌(5)ను కుల్దీప్‌ ఔట్ చేయడంతో ఆసీస్‌ మరింత కష్టాల్లోకి వెళ్లింది. ఆసీస్‌ కోల్పోయిన ఆరు వికెట్లలో్ కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించగా, జడేజా రెండు వికెట్లు తీశాడు. మహ్మద్‌ షమీకి వికెట్‌ లభించింది. అంతకుముందు భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 622/7  వద్ద డిక్లేర్‌ చేసింది. ఆసీస్‌ ఫాలో ఆన్‌ ప్రమాదంలో పడకుండా ఉండాలంటే తొలి ఇన్నింగ్స్‌లో 423 పరుగులు చేయాలి. ఆసీస్‌ రెండొందల పరుగుల లోపే సగానికి పైగా వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టుకు ఫాలో ఆన్‌ తప్పేలా లేదు.

మరిన్ని వార్తలు