హాకీ ఆసియాకప్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ గెలుపు

13 Oct, 2017 20:15 IST|Sakshi

ఢాకా: హకీ ఆసియాకప్‌ పూల్‌-ఏలో బంగ్లాదేశ్‌తో ​జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత సీనియర్‌ పురుషుల హాకీ జట్టు రెండో విజయం సాధించింది. జపాన్‌పై గెలిచి శుభారంభాన్ని అందుకున్న భారత్‌ తన జైత్రయాత్రను కొనసాగించింది. శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో 7-0తో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. మ్యాచ్‌ ఆధ్యంతం భారత ఆటగాళ్లు ఆధిపత్యం కనబర్చారు.

మ్యాచ్‌ ఏడో నిమిషంలో గుర్జాంత్‌ సింగ్‌ తొలి గోల్‌ సాధించగా.. ఆకాశ్‌ దీప్‌ (11వ నిమిషం), లలీత్‌ ఉపాధ్యాయ(14వ), అమిత్‌ రోహిదాస్‌(21వ), రమణ్‌దీప్‌ సింగ్‌(46వ)లు గోల్స్‌ సాధించారు. ఇక మరోసారి పెనాల్టీ కార్నర్‌లు సద్వినియోగం చేసుకుంటూ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ 27వ నిమిషం, 57 వనిమిషంలో రెండు గోల్స్‌ సాధించాడు. దీంతో భారత్‌ 7-0తో బంగ్లాదేశ్‌పై సునాయసంగా విజయం సాధించింది. పూల్‌-ఏలో భారత్‌ మూడో లీగ్‌ మ్యాచ్‌ను ఆదివారం పాకిస్థాన్‌తో ఆడనుంది. 

మరిన్ని వార్తలు