మౌంట్ మాంగనీ: ఆఖరి వన్డేలో టీమిండియాకు మరో షాక్ తగిలింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కోహ్లి సేనను బ్యాటింగ్కు ఆహ్వానించగా 32 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (1), కెప్టెన్ విరాట్ కోహ్లి (9) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ దశలో క్రీజులో కుదురుకున్న మరో ఓపెనర్ పృథ్వీ షా (42 బంతుల్లో 40; ఫోర్లు 3, సిక్స్లు 2) రెండో పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు.
ఇన్నింగ్స్ 13వ ఓవర్లో బెన్నెట్ వేసిన బంతిని ఫైన్ లెగ్ దిశగా తరలించిన పృథ్వీ రెండో పరుగుకోసం తొందరపడ్డాడు. శ్రేయాస్ అయ్యర్ త్వరగా రెండో పరుగు పూర్తి చేయగా.. పృథ్వీ మాత్రం కాస్త నెమ్మదించాడు. ఈక్రమంలో బంతిని అందుకున్న ఫీల్డర్ గ్రాండ్హోమ్ నేరుగా వికెట్ కీపర్ లాథమ్కు అందించడం.. అతను వికెట్లను పడగొట్టడం చకచక జరిగిపోయాయి. పృథ్వీ డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. తొలి అరంగేట్రం వన్డేలో 20 పరుగులు చేసిన పృథ్వీ, రెండో వన్డేలో 24 పరగులు చేశాడు.