భారత్, పాక్‌ మహిళల టి20 మ్యాచ్‌ రద్దు 

17 Feb, 2020 09:33 IST|Sakshi

బ్రిస్బేన్‌: మహిళల టి20 ప్రపంచ కప్‌ సన్నాహాల్లో భాగంగా జరగాల్సిన భారత్, పాకిస్తాన్‌ టి20 ప్రాక్టీస్‌ మ్యాచ్‌ రద్దయింది. ఇక్కడి అలెన్‌ బోర్డర్‌ ఫీల్డ్‌ మైదానంలో ఆదివారం జరగాల్సిన ఈ మ్యాచ్‌ వర్షం కారణంతో ఒక్క బంతి కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. భారీ వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌ చూడటానికి వచ్చిన అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. భారత్‌ తన తదుపరి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను ఈనెల 18న వెస్టిండీస్‌తో ఆడుతుంది. భారత్‌–పాక్‌ మ్యాచ్‌తో పాటు ఆస్ట్రేలియా–వెస్టిండీస్, బంగ్లాదేశ్‌–థాయ్‌లాండ్‌ మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా జరగలేదు. అడిలైడ్‌ వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఈనెల 21న భారత్, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌తో పొట్టి ప్రపంచ కప్‌కు తెరలేవనుంది.

మరిన్ని వార్తలు