విశాఖ వన్డే: టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌

18 Dec, 2019 13:21 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: నగరంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా  భారత్‌-వెస్టిండీస్‌ రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో కోహ్లి సేన మొదట బ్యాటింగ్‌ చేయనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌లో నిలిచే స్థితిలో టీమిండియా ఉండగా... మరో దూకుడైన విజయంతో 2002 తర్వాత భారత గడ్డపై వన్డే సిరీస్‌ను అందుకోవాలని విండీస్‌ సేన పట్టుదలతో ఉంది.  చెన్నైలాంటి నెమ్మదైన పిచ్‌పై 288 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత్‌ విఫలమైంది. ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా జట్టులో ఒక్క మార్పు జరిగింది. శివమ్‌ దూబే స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. అటు సిరీస్‌లో శుభారంభం చేసిన వెస్టిండీస్‌ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. అంబ్రీస్‌ స్థానంలో లూయిస్‌ను, వాల్ష్‌ స్థానంలో పియర్స్‌ను తుదిజట్టులోకి తీసుకుంది. విండీస్‌ మాజీ క్రికెటర్‌ బాసిల్‌ బుచర్‌ (86 ఏళ్లు) మృతికి సంతాపంగా నేటి మ్యాచ్‌లో విండీస్‌ క్రికెటర్లు చేతికి నల్ల బ్యాడ్జిలు ధరించి ఆడతారు.

తుది జట్ల వివరాలు
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, రాహుల్, అయ్యర్, పంత్, జాదవ్, జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, చాహర్, షమీ, కుల్దీప్‌.

విండీస్‌: పొలార్డ్‌ (కెప్టెన్‌), షై హోప్, లూయిస్, హెట్‌మైర్, పూరన్, ఛేజ్, హోల్డర్, కీమో పాల్, పియర్స్‌, జోసెఫ్, కాట్రెల్‌.

పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. అయితే డిసెంబర్‌ మాసం కావడంతో రాత్రి మంచు ప్రభావంతో బౌలర్లకు పట్టు చిక్కడం కష్టంగా మారిపోవచ్చు. దీంతో పాటు ఛేదననే ఇరు జట్లు ఇష్టపడుతున్నాయి కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోవడం లాంఛనమే. మ్యాచ్‌ రోజు వర్షసూచన లేదు.

మరిన్ని వార్తలు