న్యూఢిల్లీ: ‘స్పోర్ట్స్ హెర్నియా’తో జట్టుకు దూరమైన భారత పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్కు లండన్లో శస్త్ర చికిత్స జరిగింది. ఈ నెల 11న అతనికి ఆపరేషన్ నిర్వహించినట్లు బీసీసీఐ వెల్లడించింది. అతను తిరిగొచ్చి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస చికిత్స తీసుకొంటాడని బోర్డు ప్రకటించింది. ఫిజియోథెరపిస్ట్ యోగేశ్ పర్మార్ కూడా భువీతో పాటే ఉండి అతని చికిత్సను పర్యవేక్షిస్తున్నాడని కూడా పేర్కొంది.
అయితే ఎప్పటిలోగా అతను పూర్తిగా కోలుకొని భువీ మళ్లీ బరిలోకి దిగుతాడనే విషయంతో బోర్డు స్పష్టతనివ్వలేదు. మరో వైపు భుజం గాయంనుంచి యువ ఆటగాడు పృథ్వీ షా పూర్తిగా కోలుకున్నాడు. దాంతో భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు అతను న్యూజిలాండ్ బయల్దేరి వెళుతున్నాడు.