లార్డ్స్‌ టెస్ట్‌: నో చేంజ్‌..!

10 Aug, 2018 14:41 IST|Sakshi
కోహ్లి సేన

ఇరు జట్ల వివరాలు లీక్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌

లార్డ్స్‌ : భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య లార్డ్స్‌ వేదికగా ప్రారంభం కావాల్సిన రెండో టెస్ట్‌కు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో తొలి రోజు గురువారం ఒక్క బంతి కూడా పడలేదు కదా కనీసం టాస్‌ కూడా వేయలేదు. దీంతో నిన్నటి ఆట రద్దైంది. అయితే ఇరు జట్లకు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇరు జట్ల వివరాలు లీకయ్యాయని వాటికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా టాస్‌ వేసిన అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు జట్టులోని మార్పులేమైనా ఉంటే చెప్పి ఆ తర్వాత పూర్తి జట్టును ప్రకటిస్తారు.

కానీ, నిన్న టాస్‌ కూడా పడకపోవడంతో ఇరు జట్లు ఏ జట్టుతో బరిలోకి దిగుతున్నాయో తెలియరాలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం లార్డ్స్‌ టెస్టులో ఆడే కోహ్లిసేన ఇదేనని ఓ ఫొటో వైరల్‌ అయింది. ఎలాంటి మార్పులు లేకుండా కోహ్లి సేన లార్డ్స్‌ టెస్టులో బరిలోకి దిగుతున్నట్లు ఆ ఫొటోను బట్టి తెలుస్తోంది. ఇప్పటి వరకు కోహ్లి నాయకత్వంలో భారత్‌ 36 టెస్టులు ఆడగా ఒక్కసారి కూడా ఒకే తుది జట్టుతో వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడింది లేదు. తొలి టెస్టులో కోహ్లి తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నా కెప్టెన్సీలో విఫలమయ్యాడని, ముఖ్యంగా పుజారాను తప్పించడం ఘోర తప్పిదమని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ విమర్శల నేపథ్యంలో జట్టులో మార్పులు జరుగుతాయని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం లీకైన ఫొటో మాత్రం ఎలాంటి మార్పులు లేవని తెలియజేస్తోంది. అయితే ఈ ఫొటో తొలి టెస్టుకు సంబంధించింది అయివుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు