అంతర్జాతీయ టోర్నీలకు కోవిడ్‌–19 దెబ్బ

3 Mar, 2020 15:20 IST|Sakshi

కౌలాలంపూర్‌: మనషుల ప్రాణాల్ని హరిస్తున్న కోవిడ్‌–19 వైరస్‌తో పెద్ద ముప్పే వచ్చిపడింది. ప్రపంచ వర్తకం, వాణిజ్యం, ఔషధ, పర్యాటక, ఉత్పాదక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఈ ‘కోవిడ్‌–19’ క్రీడలతోనూ ఓ ఆటాడుకుంటోంది. దీని వల్ల ఆసియా చాంపియన్స్‌ లీగ్‌ (ఫుట్‌బాల్‌) నాకౌట్‌ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. లీగ్‌లు సవ్యంగా సాగకపోవడంతో సుదీర్ఘ షెడ్యూల్‌ అవసరమైంది. మే దాకా కొన్ని లీగ్‌ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. అవి పూర్తయ్యాకే మే నుంచి ఆగస్టు నెలలో నాకౌట్‌ మ్యాచ్‌లు జరుగుతాయని ఆసియా ఫుట్‌బాల్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఎఫ్‌సీ) జనరల్‌ విండ్‌సర్‌ జాన్‌ తెలిపారు. 

*స్క్వాష్‌ : కొవిడ్‌–19 దెబ్బకు రెండు స్క్వాష్‌ ఈవెంట్లు వాయిదా పడ్డాయి. ఈ నెల 25 నుంచి 29 వరకు కౌలాలంపూర్‌లో జరగాల్సిన ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్, చైనాలో జూన్‌ 29 నుంచి జూలై 3 వరకు జరగాల్సిన ఆసియా జూనియర్‌ పోటీలు ఎప్పుడు జరిగేది తర్వాత వెల్లడిస్తారు. 
*అజ్లాన్‌ షా హాకీ: మలేసియాలోని ఐపోలో వచ్చే నెల 11 నుంచి 18 దాకా జరగాల్సిన అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నీని సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 3 వరకు నిర్వహిస్తారు.  
*రేస్‌ వాక్‌: ఈ నెల 15 నుంచి జపాన్‌లో జరగాల్సిన ఆసియా 20 కిలోమీటర్ల రేస్‌ వాక్‌ వాయిదా పడింది. ఇందులో 13 మంది భారత అథ్లెట్లు అర్హత సాధించారు.   

మరిన్ని వార్తలు