ఆ పంచ్‌లకు సచిన్‌ మురిసిపోయాడు!

9 Mar, 2020 14:47 IST|Sakshi

ముంబై: రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్‌ తరఫున సచిన్‌ టెండూల్కర్‌-ఇర్ఫాన్‌ పఠాన్‌లు ఆడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వెస్టిండీస్‌ లెజెండ్స్‌లో వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌కు ఇర్ఫాన్‌ తన కుమారుడ్ని కూడా తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఇర్ఫాన్‌ పఠాన్‌ కుమారుడు ఇమ్రాన్‌తో కలిసి సచిన్‌ సరదాగా ఆడుకున్నాడు. 

ఈ సందర్భంగా ఓ సరదా సన్నివేషం చోటుచేసుకుంది.  ఇర్ఫాన్‌ కుమారుడు ఇమ్రాన్‌ ఖాన్‌ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌తో బాక్సింగ్‌ చేశాడు. ఓ టేబుల్‌పై నిల్చున్న ఇమ్రాన్.. సచిన్‌ కంటే తానే ఎత్తుగా ఉన్నానంటూ చెప్పాడు. అంతేకాదు తన కండలు చూపిస్తూ.. సచిన్‌పై బాక్సింగ్ పంచ్‌లు విసిరాడు. ఇమ్రాన్ అమాయకత్వంతో చేస్తున్న పనికి సచిన్ మురిసిపోయాడు. సచిన్‌, ఇమ్రాన్ బాక్సింగ్ పంచ్‌లకు సంబందించిన వీడియోను ఇర్ఫాన్‌ పఠాన్ ట్వీట్‌ చేశాడు.(సెహ్వాగ్‌ అదే బాదుడు)

'ఇమ్రాన్‌ ఏం చేశాడో వాడికి తెలీదు. పెద్దయ్యాక కచ్చితంగా బాక్సర్‌ అవుతాడు. సచిన్‌తో బాక్సింగ్‌ చేశాడు' అని పేర్కొన్నాడు. ఈ వీడియో చూసిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ ఇర్ఫాన్‌కు రీట్వీట్‌ చేశాడు. 'చిన్నారులతో సమయాన్ని పంచుకోవడం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది. ఇమ్రాన్‌.. ఒక రోజు నీ కండలు.. నా కన్నా.. మీ నాన్న కన్నా చాలా దృఢంగా ఉంటాయి' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఆడుతున్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు మహారాష్ట్ర అధికారులు ఈ టీ20 టోర్నీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా జట్లు తరఫున వెటరన్‌ క్రికెటర్లు ఆడుతున్నారు.

మరిన్ని వార్తలు