‘పాకిస్తాన్‌ను నిషేధించడం అంత ఈజీ కాదు’

25 Feb, 2019 16:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను భారత్‌ రద్దు చేసుకోవాలని ఇటీవల వ్యాఖ్యానించిన మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ..  ఆ టోర్నీ నుంచి మొత్తంగా పాకిస్తాన్‌ను నిషేధిస్తూ చర్యలు తీసుకోవడం అంత ఈజీ కాదన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) నిర్వహించే టోర్నీల నుంచి పాకిస్తాన్‌ను తప్పించడం చాలా పెద్ద విషయంగా పేర్కొన్నాడు.

‘ వరల్డ్‌కప్‌ నుంచి కానీ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి కానీ పాకిస్తాన్‌ను నిషేధించడం చాలా కష్టం. ఇది అమలు కావాలంటే చాలా పెద్ద ప్రొసెసే ఉంటుంది. మనం అనుకున‍్నంత ఈజీ అయితే కాదు. ఐసీసీ అనేది ఒక ప్రత్యేకమైన క్రికెట్‌ మండలి. అందులోనూ ఐసీసీ నిర్వహించే వరల్డ్‌కప్‌ ఇంకా ప్రత్యేకం. ఇక్కడ భారత ప్రభుత్వం కానీ బీసీసీఐ కానీ పాకిస్తాన్‌ను  నిషేధించాలనే కోరినా పెద్దగా ప్రయోజనం ఉండదు. వారితో మనం మ్యాచ్‌లు ఆడకుండా ఉండటమే సరైన నిర్ణయం. ఇప్పటికే పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను ఆపేశాం. అది భారత్‌-పాకిస్తాన్‌ల ఇరు జట్ల సమస్య మాత్రమే.

ఎప్పుడో 2006లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరిగింది. ఒక ఐసీసీ నిర్వహించే ఈవెంట్‌లో ఒక జట్టును రద్దు చేయడమనేది కష్టంతో కూడుకున్నది. భారత్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ ఆటగాళ్లకు మన ప్రభుత్వం వీసాలు నిరాకరించడంతో అదొక వివాదంగా మారింది. దీనిపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐఓసీ) తీవ్రంగా స్పందించడం మనం చూశాం. నా అభిప్రాయం ప్రకారం ఒక దేశాన్ని వరల్డ్‌కప్‌ నుంచి  రద్దు చేయడం సాధ్యం కాదు’ అని గంగూలీ తెలిపాడు.

ఇక్కడ చదవండి: ఆ సాహసం భారత్‌ చేస్తుందా?: గంగూలీ

మరిన్ని వార్తలు