ముంబై లక్ష్యం 175

4 May, 2018 21:46 IST|Sakshi

ఇండోర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కింగ్స్‌ పంజాబ్‌ తొలి వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత కేఎల్‌ రాహుల్‌(24) వికెట్‌ను కోల్పోయింది. అయితే గేల్‌ హాఫ్‌ సెంచరీ సాధించి స్కోరు బోర్డును చక్కదిద్దాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్థ శతకం సాధించిన తర్వాత గేల్‌ పెవిలియన్‌ చేరాడు. దాంతో కింగ్స్‌ పంజాబ్‌ 84 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది.

ఆ తర్వాత కాసేపటికి యువరాజ్‌ సింగ్‌(14) మూడో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక కరుణ్‌ నాయర్‌(23) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోవడంతో కింగ్స్‌ పంజాబ్‌ 134 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయింది. చివర్లో మయాంక్‌ అగర్వాల్‌(11),అక్షర్‌ పటేల్‌(13)లు నిరాశపరచగా, స్టోయినిస్‌(29 నాటౌట్‌;15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించాడు. దాంతో కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.  

మరిన్ని వార్తలు