ఐపీఎల్‌ వేలం: అదృష్టమంటే ఆండ్రూ టైదే!

28 Jan, 2018 13:24 IST|Sakshi
ఆండ్రూ టై(ఫైల్‌ఫొటో)

బెంగళూరు: ఈసారి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) వేలంలో ఆస్ట్రేలియా బౌలర్‌ ఆండ్రూ టైని అదృష్టం వరించిందనే చెప్పాలి. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో చెలరేగిపోయిన ఆండ్రూ టై..  ఐపీఎల్‌-11 వేలంలో రూ. 7. 2 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోవడంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు.  ఆండ్రూ టై కనీస ధర రూ. 1 కోటి ఉండగా, అతనికి భారీ మొత్తం చెల్లించి కింగ్స్‌ పంజాబ్‌ సొంతం చేసుకుంది. అయితే ఇంగ్లండ్‌తో ఐదో వన్డేలో ఐదు వికెట్లను సాధించిన తర్వాత ఆండ్రూ టై ఐపీఎల్‌ వేలానికి రావడం విశేషం.

దాంతో ఆండ్రూ టై ఐదు వికెట్లకు ఏడు కోట్లు దక్కాయంటూ క్రికెట్‌ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. గత కొంతకాలంగా పెద్దగా ఆకట్టుకోని టై.. ఐపీఎల్‌ వేలానికి ముందే ఫామ్‌లోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్‌తో నాల్గో వన్డేలో మూడు వికెట్లు సాధించిన టై.. అంతముందు రెండు వన్డేలు ఆడి కనీసం వికెట్‌ కూడా సాధించలేదు. ఈ ఐదు వన్డేల సిరీస్‌లో చివరి రెండు వన్డేల్లో ఎనిమిది వికెట్లు సాధించడమే అతనికి అత్యధిక మొత్తం పలకడానికి ప్రధాన కారణం. మరొకవైపు గతేడాది రూ. 12 కోట్లకు అమ్ముడుపోయిన ఇంగ్లిష్‌ పేసర్‌ తైమాల్‌ మిల్స్‌ను ఈసారి ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 2017లో ఆర్సీబీ తరపున మిల్స్‌ ఆడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు