మెస్సీ సిక్సర్‌... 

4 Dec, 2019 00:15 IST|Sakshi

రికార్డు స్థాయిలో ఆరోసారి ‘గోల్డెన్‌ బాల్‌’ పురస్కారం సొంతం

పారిస్‌: ప్రతి యేటా ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌కు అందించే ‘బ్యాలన్‌ డి ఓర్‌’ (గోల్డెన్‌ బాల్‌) అవార్డు ఈసారి అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీని వరించింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఆరోసారి గెల్చుకోవడం ద్వారా మెస్సీ కొత్త చరిత్ర సృష్టించాడు. గతేడాది వరకు ఐదుసార్లు చొప్పున క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్‌), మెస్సీ ఈ అవార్డు సాధించి సమఉజ్జీగా నిలిచారు. తాజా పురస్కారంతో రొనాల్డోను వెనక్కి నెట్టి మెస్సీ అత్యధికసార్లు ఈ అవార్డు గెల్చుకున్న ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో మెస్సీ 2009, 2010, 2011, 2012, 2015లలో ఈ అవార్డు గెల్చుకున్నాడు.

సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ కార్యక్రమంలో మెస్సీకి అత్యధికంగా 686 ఓట్లు లభించాయి. నెదర్లాండ్స్‌ డిఫెండర్‌ విర్గిల్‌ వాన్‌ డిజ్క్‌ 679 ఓట్లతో రెండో స్థానంలో నిలువగా... పోర్చుగల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మూడో స్థానానికి పరిమితమయ్యాడు. 2019 సీజన్‌లో మెస్సీ 54 మ్యాచ్‌ల్లో 46 గోల్స్‌ సాధించాడు. మహిళల విభాగంలో అమెరికాకు చెందిన మెగాన్‌ రాపినోయ్‌ ‘బ్యాలన్‌ డి ఓర్‌’ అవార్డును గెల్చుకుంది.

ఈ ఏడాది జరిగిన మహిళల ప్రపంచకప్‌ను అమెరికా గెలవడంలో ఆమె ప్రముఖ పాత్ర పోషించింది. ప్రపంచ కప్‌లో అత్యధిక గోల్స్‌ సాధించే వారికి ఇచ్చే ‘గోల్డెన్‌ బూట్‌’ అవార్డును, ఫిఫా బెస్ట్‌ ప్లేయర్‌ అవార్డును మెగాన్‌ గెల్చుకోవడం విశేషం. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా)లో ఓటింగ్‌ సభ్య త్వం ఉన్న 176 దేశాలకు సంబంధించిన ప్రముఖ ఫుట్‌బాల్‌ జర్నలిస్ట్‌లు లేదా ఫుట్‌బాల్‌ను టెలికాస్ట్‌ చేసే బ్రాడ్‌కాస్టర్‌లు ఈ ఓటిం గ్‌లో పాల్గొంటారు.

>
మరిన్ని వార్తలు