ఇంగ్లండ్ చేతిలో విండీస్ చిత్తు
బ్రిస్టల్: వెస్టిండీస్లో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ మెరుపు బ్యాటింగ్ను ప్రదర్శించాడు. 53 బంతుల్లోనే సెంచరీ సాధించిన అతను, ఇంగ్లండ్ తరఫున రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. మొయిన్ అలీ (57 బంతుల్లో 102; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) జోరుతో ఇంగ్లండ్ 124 పరుగుల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. ముందుగా ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 369 పరుగులు చేసింది.
జో రూట్ (79 బంతుల్లో 84; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. ఒక దశలో తాను ఎదుర్కొన్న తొలి 39 బంతుల్లో 39 పరుగులే చేసిన అలీ...ఆ తర్వాత విశ్వరూపం ప్రదర్శించాడు. తర్వాతి 14 బంతుల్లో అతను 8 సిక్సర్లు, 2 ఫోర్ల సహాయంతో మరో 61 పరుగులు చేయడం విశేషం. అనంతరం విండీస్ 39.1 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటైంది. క్రిస్ గేల్ (78 బంతుల్లో 94; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగినా...మిగతా ఆటగాళ్ల వైఫల్యంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ప్లంకెట్కు 5 వికెట్లు దక్కాయి.