ఇండియన్‌ ఆర్మీపై ఎంఎస్‌ ధోని టీవి షో..!

9 Dec, 2019 19:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచం గుర్తించేలా క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన మిస్టర్ పర్ఫెక్ట్ ధోని ఇండియన్ ఆర్మీపై ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు. ఎంఎస్‌ ధోని ప్రపంచకప్‌ తర్వాత బ్యాట్‌ పట్టలేదు. సైన్యంలో రెండు నెలలు పనిచేయాలంటూనే ఆ పని పూర్తయినా.. తన విరామాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే ఈ విరామ సమయంలో కూతురు జీవా, భార్య సాక్షితో సరదాగా వివిధ ప్రదేశాలను చుట్టేస్తున్నాడు. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా గౌరవాన్ని పొందిన మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు మన సైనికుల కోసం మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు. వారితో కలిసి కొంత కాలం పనిచేసినపుడు సైనికుల సమస్యల మీద కొంత అవగాహన ఏర్పడడంతో.. సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో తెలియజేసేందుకు సొంతంగా ఒక టీవీ షోని నిర్మించేందుకు ధోని సిద్దమయ్యాడు.

భారతదేశ సాయుధ దళాల పనితనాన్ని అలాగే వారు దేశం కోసం చేసిన, చేస్తున్న కృషిని గురించి అందరికీ తెలియచేసేలా ఈ షో నిర్వహించనున్నారని తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక క్రికెటర్ ఒక మంచి పనికి సిద్దమవడం విశేషం. స్టార్ ప్లస్‌లో షో టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం. షో ఇంకా మొదలవ్వకముందే జనాల్లో ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ధోని నిర్మిస్తున్న ఈ షో సోనీ టీవీలో ప్రసారం అయ్యే అవకాశాలున్నాయి. కాగా..ధోని గత కొద్ది కాలంగా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు