‘అశ్విన్‌ చెప్పిన మిస్టరీ బాల్‌ను ప్రయోగిస్తా’

11 Jun, 2018 15:44 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆఫ్‌ స్పిన్నర్‌ రవి చంద్రన్‌ అశ్విన్‌ దగ్గర నేర్చుకున్న మెళుకువల్ని టీమిండియాపైనే ప‍్రయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లు అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ ముజీబ్‌ జర్దాన్‌ స్పష్టం చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌ వద్ద అనేక బౌలింగ్‌ సీక్రెట్లను తెలుసుకున్నానని, వాటిని త్వరలో భారత్‌తో జరిగే టెస్టులో ప్రయోగిస్తానన్నాడు. ఐపీఎల్‌లో కింగ్స్‌ పంజాబ్‌ తరపున ముజీబ్‌ ఆడిన సంగతి తెలిసిందే.

కాగా, గురువారం భారత్‌తో బెంగళూరు వేదికగా అఫ్గాన్‌-భారత్‌ జట్ల మధ్య ఏకైక టెస్టు జరుగనున్న నేపథ్యంలో ముజీబ్‌ ఇంటర్య్వూ ఇచ్చాడు. ‘ ఐపీఎల్‌ ఆడే సందర్భంలో నెట్స్‌లో ఎక్కువగా అశ్విన్‌తో గడిపేవాడిని. దాంతో చాలా విషయాల్ని నేర్చుకున్నాను. ప్రధానంగా బంతిని ఏ రకంగా సంధించి బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టవచ్చో తెలిసింది. కొత్త బంతితో బౌలింగ్‌ వేసే విధానాన్ని కూడా అశ్విన్‌ ద్వారా తెలుసుకున్నా. ఆఫ్‌ స్పిన్‌ యాక్షన్‌లో క్యారమ్‌ బాల్‌ను ఎలా వేయాలో కూడా అశ్విన్‌ నేర్పాడు. దాంతో పాటు ఒక మిస్టరీ బాల్‌ను కూడా అశ్విన్‌ చెప్పాడు. ఆ బంతిని భారత్‌పై జరిగే టెస్టులో ప‍్రయోగిస్తా’ అని ముజీబ్‌ చెప్పాడు.
 

మరిన్ని వార్తలు