హైదరాబాద్‌ బోణీ

2 Dec, 2018 00:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు తొలి విజయం నమోదు చేసుకుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌ (3/9), రవికిరణ్‌ (4/32) విజృంభించడంతో పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్ల లో 97 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (48 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌), అక్షత్‌ రెడ్డి (44 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఒక పరుగుతో కలుపుకొని హైదరాబాద్‌ 28.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 97 పరుగులు చేసి గెలుపొందింది. మరో మ్యాచ్‌లో 41 సార్లు రంజీ చాంపియన్‌ ముంబైపై గుజరాత్‌ తొమ్మిది వికెట్లతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ ప్రియాంక్‌ (109 బంతుల్లో 112 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగడంతో 204 పరుగుల విజయలక్ష్యాన్ని గుజరాత్‌ 41.5 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. 

మరిన్ని వార్తలు