-

‘రాంచీ టెస్టులో ఆ రెండే కీలకం’

17 Oct, 2019 15:55 IST|Sakshi

రాంచీ: ఇప్పటికే భారత జట్టుతో జరిగిన రెండు టెస్టులను కోల్పోయి సిరీస్‌ను చేజార్చుకున్న దక్షిణాఫ్రికా చివరిదైన మూడో టెస్టులో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. భారత్‌ గట్టి పోటీ ఇస్తామంటూ భారత్‌ పర్యటనకు వచ్చిన సఫారీలు.. రెండు టెస్టుల్లోనూ తేలిపోయారు. అటు పేస్‌ బౌలింగ్‌తో ఇటు స్పిన్‌ బౌలింగ్‌లో ఉచ్చులో చిక్కుకుని సిరీస్‌ను కోల్పోయారు. అయితే మూడో టెస్టు కూడా స్పిన్‌ అనుకూలమని అంటున్నాడు దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌. ‘ రాంచీ పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తుందనే అనుకుంటున్నా. నేను పిచ్‌ను చూశాడు. చాలా పొడిగా గట్టిగా ఉంది.

దాంతో రివర్స్‌ స్వింగ్‌, స్పిన్‌లు కీలక పాత్ర పోషించడం ఖాయం. తొలి ఇన్నింగ్స్‌లో మేము భారీ పరుగులు చేయాలి. తొలి ఇన్నింగ్స్‌లో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. మొదటి ఇన్నింగ్స్‌లో పరుగులు చేస్తే, రెండో ఇన్నింగ్స్‌లో ఏదైనా జరుగుతుంది’ అని డుప్లెసిస్‌ తెలిపాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా పేసర్‌ రబడా మాట్లాడుతూ.. ‘భారత పేసర్లు బంతిని రివర్స్‌ స్వింగ్‌ బాగా చేస్తున్నారు. అదే సమయంలో స్పిన్నర్లు కూడా రాణిస్తున్నారు. మేము బంతిని రివర్స్‌ స్వింగ్‌ చేయడంలో విఫలమయ్యాం. అది మా ప్రధాన ఆయుధమైనప్పటికీ అందులో సక్సెస్‌ కాలేకపోయాం. దాంతోనే రెండు టెస్టులను చేజార్చుకుని సిరీస్‌ కోల్పోయాం’ అని రబడా పేర్కొన్నాడు. శనివారం రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో భారత్‌-దక్షిణాఫ్రికాల మధ్య చివరి టెస్టు ఆరంభం కానుంది.

మరిన్ని వార్తలు