ఆరు స్వర్ణాలు గెలిచిన బ్లేడ్‌ రన్నర్‌.. గర్ల్‌ఫ్రెండ్‌ను హత్యచేసి.. తొమ్మిదేళ్ల తర్వాత

25 Nov, 2023 08:25 IST|Sakshi

ప్రిటోరియా: గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన కేసులో గత తొమ్మిదేళ్లుగా జైల్లో ఉన్న మాజీ ఒలింపియన్,  ప్రముఖ బ్లేడ్‌ రన్నర్‌ ఆస్కార్‌ పిస్టోరియస్‌కు పెరోల్‌ లభించింది. దక్షిణాఫ్రికాకు చెందిన పిస్టోరియస్‌ పారాలింపిక్స్‌లో ఆరు స్వర్ణపతకాలు గెలుచుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచి ప్రశంసలు పొందాడు.

అయితే తన కెరీర్‌ అత్యుత్తమ దశలో ఉన్న సమయంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ రీవా స్టీన్‌కాంప్‌ను హత్య చేసి జైలుపాలయ్యాడు. వలంటైన్స్‌డే రోజు ఆమెతో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఫిబ్రవరి 14, 2013లో తన ప్రేయసి రీవా స్టీన్‌కాంప్‌ బాత్‌రూంలో ఉన్న సమయంలో బయటి నుంచి కాల్పులు జరిపాడు. తలుపును చీల్చుకు వెళ్లిన బుల్లెట్లు తాకి తీవ్రంగా గాయపడ్డ రీవా మరణించింది. అయితే, పిస్టోరియస్‌ మాత్రం.. లోపల ఉన్నది దొంగ అనుకుని పొరబడి షూట్‌ చేసినట్లు తెలిపాడు.

కానీ.. అక్కడ లభించిన సాక్ష్యాల ఆధారంగా పిస్టోరియస్‌ దోషిగా తేలాడు. దీంతో 2014లో అతడు జైలుపాలయ్యాడు. ఈ కేసులో  పిస్టోరియస్‌కు మొత్తం 13 ఏళ్ల 5 నెలల జైలు శిక్ష పడింది. ఈ క్రమంలో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అతడు జైలు నుంచి విడుదల కానున్నాడు. జనవరి 5న పిస్టోరియస్‌ ఇంటికి వెళ్లే అవకాశం ఉంది.

చదవండి: యువరాణి.. 225 ఎకరాల ఎస్టేట్‌.. 6 ఎకరాల్లో ప్యాలెస్‌.. భారత క్రికెటర్‌గా! జడేజాకు చుట్టమా?

మరిన్ని వార్తలు