రోహిత్‌ ఎవరితో మాట్లాడుతున్నాడు?

12 Dec, 2019 15:12 IST|Sakshi

ముంబై: వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి టీ20లో రోహిత్ శర్మ టచ్‌లోకి వచ్చాడు.  తొలి రెండు టీ20ల్లో నిరాశపరిచిన రోహిత్‌.. నిన్న జరిగిన సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో 34 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 71 పరుగులు చేశాడు. రాహుల్‌తో కలిసి 135 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో జరిగిన మొదటి రెండు వన్డేల్లో రోహిత్ శర్మ(8, 15) పరుగులతో నిరాశపరిచాడు. తన సొంత మైదానంలో వెస్టిండీస్ బౌలర్లను రోహిత్ శర్మ చీల్చి చెండాడు.


కాగా, రోహిత్ శర్మ ఔటైన తర్వాత,   స్టాండ్‌లో భార్య రితికాతో కలిసి ఉన్న కూతురు సమైరాతో మాట్లాడేందుకు యత్నించాడు. ఇలా రోహిత్‌ శర్మ డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచే కూతురితో మాట్లాడేందుకు యత్నించిన సమయంలో అభిమానులు ఫొటోలు కోసం పోటీ పడ్డారు. వరుసగా సెల్ఫీలు తీస్తూ రోహిత్‌ను కెమెరాలో బంధించారు. దీన్ని  పోస్ట్‌ చేసిన ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌.. రోహిత్‌ శర్మ ఎవరితో మాట్లాడుతున్నాడో కనిపెట్టండి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది.

మూడో టీ20లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన  టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండిస్ 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.  మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే చెన్నై వేదికగా ఆదివారం జరగనుంది.

మరిన్ని వార్తలు