సెమీస్‌లో సౌరభ్, మిథున్‌

28 Jul, 2018 01:37 IST|Sakshi

  రోహన్‌–కుహూ జంట కూడా

రష్యా ఓపెన్‌ టోర్నమెంట్‌ 

వ్లాదివోస్టాక్‌ (రష్యా): రష్యా ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ వరల్డ్‌ సూపర్‌–100 టోర్నమెంట్‌లో భారత షట్లర్లు సౌరభ్‌ వర్మ , మిథున్‌ మంజునాథ్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ సౌరభ్‌ వర్మ 21–14, 21–16తో మిషా జిల్‌బెర్మన్‌ (ఇజ్రాయెల్‌) పై గెలుపొందాడు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విజయం సొంతం చేసుకొని సెమీస్‌ చేరాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో మిథున్‌ 21–18, 21–12తో సతీశ్‌థరన్‌ రామచంద్రన్‌ (మలేసియా)పై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించాడు.

శనివారం జరుగనున్న సెమీఫైనల్లో మిథున్‌తో సౌరభ్‌ వర్మ తలపడనున్నాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్‌ శుభాంకర్‌ డే 20–22, 15–21తో రెండో సీడ్‌ వ్లాదిమిర్‌ మాల్కోవ్‌ (రష్యా) చేతిలో ఓడి క్వార్టర్స్‌లోనే నిష్క్రమిం చాడు. మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్‌ అమ్మాయి గుమ్మడి వృశాలి 9–21, 11–21తో యెన్‌ మై హో (మలేసియా) చేతిలో; రితూపర్ణ దాస్‌ 17–21, 13–21తో ఐరిస్‌ వాంగ్‌ (అమెరికా) చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.  మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రెండో సీడ్‌ రోహన్‌ కపూర్‌–కుహూ గార్గ్‌ జోడీ సెమీస్‌ చేరింది. క్వార్టర్స్‌లో రోహన్‌–కుహూ ద్వయం 21–13, 21–9తో అండ్రేజ్‌ లొగినోవ్‌–లిలియా అబిబులయేవా (రష్యా) జంటపై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. మరో భారత జోడీ సౌరభ్‌ శర్మ–అనౌష్క పారిఖ్‌ 15–21, 8–21తో చెన్‌ టాంగ్‌ జై–యెన్‌ వై పీక్‌ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి వెనుదిరిగింది.    

మరిన్ని వార్తలు